ప్రజాకవి రఘువీర్ నారాయణ్ లక్ష్మీకాంత్ శ్రీనివాసరాం రాజా కాళోజీ (సెప్టెంబరు 9, 1914 - నవంబరు 13, 2002) "కాళోజీ నారాయణరావు లేదా కాళోజీ లేదా కాళన్న"గా సుపరిచితులు. అతను తెలంగాణ ప్రజల ప్రతీ ఉద్యమం యొక్క ప్రతిధ్వనిగా కొనియాడబడతాడు. అతను రాజకీయ సాంఘిక చైతన్యాల సమాహారం. కవిత్వం వ్రాసిన ప్రజాకవి. హక్కులడిగిన ప్రజల మనిషి. ఉద్యమం నడిపిన ప్రజావాది. మొత్తంగా తెలంగాణ జీవిత చలనశీలి కాళోజి. పుట్టుక, చావులు కాకుండా బతుకంతా తెలంగాణ కిచ్చిన మహనీయుడు, వైతాళికుడు కాళోజి. నిజాం దమన నీతికి, నిరంకుశత్వానికి, అరాచక పాలనకి వ్యతిరేకంగా అతను తన కలం ఎత్తాడు. అతను స్వాతంత్ర్యసమరయోధుడు, తెలంగాణా ఉద్యమకారుడు. అతను 1992లో భారతదేశ రెండవ అత్యున్నత పౌర పురస్కారం పద్మవిభూషణ్ పొందాడు. అతని జన్మదినాన్ని తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ భాషా దినోత్సవంగా చేసి గౌరవించింది. వరంగల్ లో నెలకొన్న ఆరోగ్య విశ్వవిద్యాలయానికి అతని పేరు పెట్టబడింది.[5] అలాగే హన్మకొండ పట్టణంలో కాళోజీ కళాక్షేత్రం నిర్మిస్తున్నారు.
తెలంగాణ తొలిపొద్దు కాళోజీ. ‘అన్యాయాన్నెదిరిస్తే నా గొడవకు సంతృప్తి-అన్యాయం అంతరిస్తే నా గొడవకు ముక్తిప్రాప్తి. అన్యాయాన్నెదిరించిన వాడే నాకారాధ్యుడు’ అని సగర్వంగా ప్రకటించి ఉద్యమమే ఊపిరిగా జీవించిన ప్రజాకవి కాళోజీ నారాయణరావు.